తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 22న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో అనుకోకుండా జరిగే దోషాల నివారణకు ఆగమశాస్త్ర ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.
మూడు రోజుల పాటు సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ప్రత్యేక అలంకరణతో నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 23న పవిత్రాల ప్రతిష్ట, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
పవిత్రోత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 22న సహస్రదీపాలంకార సేవ, ఆగస్టు 23 నుంచి 25 వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు కానున్నాయి. ఆగస్టు 25న అష్టదళ పాదపద్మారాధన సేవతో పాటు, ఆగస్టు 26న కల్యాణోత్సవ సేవను కూడా రద్దు చేశారు.
భక్తులు ఈ మార్పులను గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
