తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజులుగా ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు సోమవారం సాయంత్రం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.
చివరి రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో ప్రత్యేక అభిషేకం చేశారు.
సాయంత్రం ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహించగా, అనంతరం భాష్యకార్ల గుడి వద్ద ఇయల్ శాత్తుమొర జరిగింది. ఆ తర్వాత యాగశాలలో వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
పూర్ణాహుతి అనంతరం ఉత్సవమూర్తులు, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణగా సన్నిధికి తీసుకువచ్చి కుంభావాహనం తదితర పవిత్ర క్రతువులను ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.
పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయం వేద మంత్రఘోష, గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి కృపాకటాక్షాలు భక్తులందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.
కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో బి. నాగరత్న, ప్రధాన అర్చకులు ఆనందకుమార్ దీక్షితులు, అధికారులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
