వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పట్టాభిషేక మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఆగస్టు 17న సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో మూడు రోజుల మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఆగస్టు 18న సీతారాముల శాంతి కల్యాణం
రెండో రోజు ఉదయం యాగశాల పూజ, 10 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ, 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కల్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ జరగనుంది.
ఆగస్టు 19న శ్రీరామ పట్టాభిషేకం
మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీరామ పట్టాభిషేకం ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ అనంతరం రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.
అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించడంతో మహోత్సవాలు ముగుస్తాయి.
రూ.300తో ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం
భక్తులు రూ.300 చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. సేవలో పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేయనున్నారు.
మూడు రోజుల పాటు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పట్టాభిరామస్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ కోరింది.
