కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి జూలై నెలలో భక్తులు భారీగా తరలివచ్చారు. నెల రోజుల వ్యవధిలో ఏకంగా 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది. జూలైలో శ్రీవారి హుండీ ద్వారా రూ.140.29 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో ఐదు రోజుల పాటు హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్కును దాటడం విశేషం. జూలై 16న అత్యధికంగా రూ.5.31 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న 10.58 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సెలవులు, వారాంతాలు, శుభముహూర్తాలు వరుసగా రావడంతో జూలై నెలంతా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది.
భక్తుల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ దర్శనం, వసతి, అన్నప్రసాదం, లడ్డూ పంపిణీ తదితర సేవలను టీటీడీ అధికారులు సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
