శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ఆగస్టు 15వ తేదీ నుంచి వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల వేళల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనాల నిర్వహణలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
వీఐపీలకు సంబంధించిన రెఫరల్ లేఖలను దర్శనానికి 48 గంటల ముందుగానే దేవస్థానం కార్యాలయానికి సమర్పించాలని అధికారులు సూచించారు. లేఖలను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే సంబంధిత వ్యక్తులకు మెసేజ్ వచ్చేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ఈఓ తెలిపారు.
తిరుమల తరహాలో వీఐపీ దర్శనాలను స్లాట్ విధానంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఏపీ ప్రభుత్వ అనుమతితో పాటు ట్రస్ట్ బోర్డు ఆమోదంతో ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. దీంతో వీఐపీ దర్శనాల కోసం భక్తులు ఎక్కువసేపు కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం ఉండదని అధికారులు తెలిపారు.
శ్రీశైలానికి రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నామని ఈఓ పేర్కొన్నారు. ముఖ్యంగా శని, ఆదివారాలు, సోమవారాల్లో రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో రోజుకు రెండు విడతల్లో మాత్రమే స్పర్శ దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
కొత్త విధానం ద్వారా వీఐపీ దర్శనాలను క్రమబద్ధీకరించడంతో పాటు సాధారణ భక్తులకు సైతం సులభంగా, సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవస్థానం చర్యలు చేపడుతోంది.
