శ్రావణ మాసం సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు స్పర్శ దర్శనం, ఆర్జిత సేవల్లో స్వల్ప మార్పులు చేశారు. ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర భారత రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శుక్ర, శని, ఆదివారం, సోమవారాల్లో మొత్తం 19 రోజుల పాటు ఆర్జిత అభిషేకం, ఆర్జిత కుంకుమార్చన సేవలను నిలిపివేయనున్నారు. ఈ రోజుల్లో రాత్రి 8.30 గంటలకు ఒకే స్లాట్లో కేవలం 250 స్పర్శ దర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు.
ఇతర రోజుల్లో స్పర్శ దర్శనం టికెట్లు ఉదయం 7.30 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు, రాత్రి 9 గంటలకు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. రద్దీ తక్కువగా ఉండే రోజుల్లో ఆర్జిత అభిషేకం, ఆర్జిత కుంకుమార్చన టికెట్లను కూడా సాధారణంగానే పొందవచ్చు.
భక్తుల సౌకర్యార్థం టికెట్లలో 80 శాతం టికెట్లను ‘మనమిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా, మిగిలిన 20 శాతం టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు ముందుగానే స్పర్శ దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను బుక్ చేసుకుని, అందుకు అనుగుణంగా తమ శ్రీశైలం యాత్రను ప్లాన్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
