అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగానికి ప్రతీక 'రక్షాబంధన్' (రాఖీ పౌర్ణమి). సోదరుడికి రక్షగా సోదరి రాఖీ కడితే.. ఆమెకు జీవితకాలం అండగా ఉంటానని సోదరుడు ప్రమాణం చేసే అపురూపమైన పండుగ ఇది. ఈ ఏడాది (2026) రాఖీ పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుండటంతో రాఖీ కట్టే ముహూర్తంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రహణ ప్రభావం రాఖీ పండుగపై ఉంటుందా..? సూతక కాలం వర్తిస్తుందా..? తదితర ధార్మిక విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి..
పంచాంగం ప్రకారం, 2026లో ఆగస్టు 28న శుక్రవారం రక్షాబంధన్ జరుపుకోనున్నారు. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటల వరకు ఉంటుంది. ఈ పండుగ నాడు 'భద్ర' కాలం అంటే ఒక అశుభ కాలం సూర్యోదయానికి ముందే ముగియనుంది. కాబట్టి, రాఖీ కట్టేందుకు భద్ర దోషం ఎలాంటి ఆటంకం కలిగించదు.
చంద్రగ్రహణం సమయం - దృశ్యమానత..
ఆగస్టు 28న ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఉదయం 8:03 గంటల నుంచి 11:22 గంటల వరకు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణ ఉచ్ఛ స్థితి ఉదయం 9:43 గంటలకు ఉంటుంది. అయితే ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కేవలం ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది.
రాఖీ కట్టే సమయంపై ప్రభావం ఉంటుందా..?
సాధారణంగా గ్రహణం అనగానే పూజా కార్యక్రమాలు, ముహూర్తాలపై ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆగస్టు 28న ఏర్పడే చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి, దీని ప్రభావం రాఖీ పండుగపై ఉండదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సోదరీమణులు నిర్ణీత శుభ ముహూర్తంలో ఎలాంటి సందేహం లేకుండా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. కేవలం గ్రహణం ఉందన్న వార్త విని ముహూర్తాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు.
సూతక కాలం వర్తిస్తుందా..?
హైందవ సంప్రదాయం ప్రకారం, గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో అక్కడే సూతక కాలం అంటే అశుభ కాలం వర్తిస్తుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి, ఇక్కడ సూతక కాలం నిబంధనలు వర్తించవు. రక్షాబంధన్ నాడు పూజా కార్యక్రమాలను యథావిధిగా, సంతోషంగా నిర్వహించుకోవచ్చు.
రాఖీ కట్టే శాస్త్రీయ విధానం..
రక్షాబంధన్ నాడు ఈ విధంగా పండుగను ఆచరించడం విశేష ఫలితాలను ఇస్తుంది. స్నానం, పూజ..ఉదయాన్నే నిద్రలేచి, స్నానాదికాలు ముగించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా పళ్లెం.. రాఖీ కట్టేందుకు ఒక పళ్లెంలో కుంకుమ, అక్షతలు, నెయ్యి దీపం, మిఠాయిలు, అందమైన రాఖీని సిద్ధం చేసుకోవాలి.
దైవ ప్రార్థన..ముందుగా ఇష్టదైవానికి పూజ చేసి, ఆ తర్వాత సోదరుడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి నుదుటిన తిలకం దిద్దాలి.
రక్షా బంధనం..సోదరుడి కుడి చేతికి రాఖీ కట్టి, ఆరతి ఇచ్చి, మిఠాయి తినిపించాలి. ఈ సమయంలో అతడి ఆయురారోగ్యాల కోసం దేవుడిని ప్రార్థించాలి.
బహుమతి ప్రదానం.. సోదరుడు తన సోదరికి బహుమతి లేదా ఆశీర్వాదం అందించి, జీవితాంతం ఆమెకు రక్షగా ఉంటానని సంకల్పం తీసుకోవాలి. గ్రహణం మన దేశంలో కనిపించనప్పటికీ, పౌర్ణమి తిథి, ప్రాంతీయ పద్ధతుల ఆధారంగా ముహూర్తాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కచ్చితమైన ముహూర్తం కోసం మీ ప్రాంతంలోని స్థానిక పంచాంగాన్ని లేదా పండితులను సంప్రదించడం ఉత్తమం.
