మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తోడు, తీరమంతా రుద్రాక్ష వృక్షాల నీడలు పరవశాన్ని అందించనున్నాయి. యాత్రా మార్గంలో ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణను మేళవిస్తూ అటవీశాఖ ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.
50 హెక్టార్లలో పచ్చని హరివిల్లు..
బద్రీనాథ్ జాతీయ రహదారి వెంబడి సుమారు 50 హెక్టార్ల భూమిని సేకరించి, అందులో పెద్ద ఎత్తున రుద్రాక్ష వనాలను పెంచాలని అటవీ శాఖ యోచిస్తోంది. ఇందుకోసం అలకనంద అటవీ విభాగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. కేవలం రుద్రాక్షలే కాకుండా, హిందూ ధర్మంలో పవిత్రంగా భావించే వృక్షాలను నాటడం ద్వారా యాత్రా మార్గాన్ని ఒక 'ఆధ్యాత్మిక వనంగా' తీర్చిదిద్దనున్నారు.
గతంలో ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా రహదారి విస్తరణ కోసం అనేక పురాతన వృక్షాలను తొలగించాల్సి వచ్చింది. ముఖ్యంగా నందప్రయాగ, బిరాహి, హేలాంగ్ వంటి ప్రాంతాల్లో యాత్రికులకు నీడను పంచే రావి, మర్రి, దేవదారు వృక్షాలు కనుమరుగయ్యాయి. ఈ లోటును పూడుస్తూ.. ఇప్పుడు నూతనంగా పవిత్ర వృక్షాలు: రావి, మర్రి, బిల్వపత్రి, భోజపత్ర. స్థానిక జాతులు: దేవదారు, మామిడి, పద్మ, సురాని, బురాన్ష్. వంటి మొక్కలను నాటి, పర్యావరణ సమతుల్యతను కాపాడనున్నారు.
"బద్రీనాథ్ ఆస్థా మార్గానికి మతపరమైన, పర్యావరణ హితమైన హంగులు అద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే భక్తులకు ప్రకృతి ఒడిలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది."-ఆకాష్ వర్మ, గర్వాల్ అటవీ సంరక్షకుడు.
ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే, రిషికేశ్ నుండి బద్రీనాథ్ వరకు సాగే ప్రయాణం కేవలం యాత్రగానే కాకుండా.. విశ్వాసం, సంస్కృతి, ప్రకృతి కలబోసిన అద్భుత ఆధ్యాత్మిక పయనంలా సాగనుంది.
