Srisailam Temple


శ్రీశైల క్షేత్రం

శ్రీశైలక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది.


చరిత్ర

ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం.చెంచు రామయ్య గా కూడా పిలవబడుతున్నాడు. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.


శాసనాధారాలు

శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది సా.శ.6వ శతాబ్ది నాటిది. ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది.


స్థల పురాణం

పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మoత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

కృతయుగమున పుత్రార్ధియై ఘోరతప మాచరించిన శిలాద మహర్షికి పరమేశ్వరానుగ్రహంబున జన్మించిన నందికేశ్వర, పర్వత నామధేయులగు కుమార రత్నములు, తమ తీవ్ర తపోగ్ని జ్వాలలచే త్రిలోకంబుల గడగడలాడించి పరమేశ్వరుని ప్రత్యక్షము గావించుకొనిరి. వారిలో నందీశ్వరుడు ప్రమథగణాధిపత్యమును, ఈశ్వర వాహనత్వమును వరములుగా బడెసెను. పర్వతుడు తాను పర్వతాకారముదాల్చుదునని, తన శిఖరముపై పరమేశ్వరుడు త్రిశత్కోటి దేవతలతో ప్రమధులతో సర్వతీర్థక్షేత్ర రాజములతో స్వయంభూ లింగరూపమున పార్వతీ సమేతుడై వెలయవలయునని, తన శిఖర దర్శన మాత్రంబుననే జనులకు ముక్తి నొసంగ వలయునని వేడుకొనిన నాటినుండి శ్రీశైలము మహామహిమోపేతమై ప్రఖ్యాతిగాంచింది.శ్రీశైలమని పేరువచ్చుటకు గల కారణము-కృతయుగాంతమున గల 'సుమతి' నామధేయుడగు మునీంద్రుని పుత్రికామణియగు 'శ్రీ' తన ఉగ్రతపంబుచే ఈశుని మెప్పించి ' ఈ పర్వతమున ఎల్లకాలము నాపేరు ముందునిడి ప్రజలు పిలుచు నట్లు పరమేశుని వరమనుగ్రహింపమని ప్రార్థించి, సఫల మనోరధురారైనప్పటి నుండి ఈ పర్వతము శ్రీ పర్వతమనియు, శ్రీశైలమనియు వ్యవహరింపబడింది.

స్వామికి మల్లికార్జున నామ ధేయము కలుగుటకు కారణం: శ్రీశైల సమీపమందలి మల్లికాపుర మహారాజగు చంద్రగుప్తుడు శత్రువిజేతయై, స్వదేశానికి ద్వాదశ వర్షానంతరము మేగుదెంచి, పరమేశ్వరానుగ్రహ సంజాతయు, అపురూప లావణ్య పుంజమును, తన పుత్రికా రత్నమును అగు చంద్రమతి గాంచి కామించెను.ఎవరెన్ని విధముల వలదని వారించు చున్నను వినక మోహవివశతచే కామాంధుడై అనుచితముగా ప్రవర్తింప ఆమె తప్పించుకొని శ్రీశైలమునకేగి శివుని మల్లికా కుసుమంబుల బూజించి ప్రత్యక్షము గావించుకొనినది. కామ్మంధుడగు తన తండ్రిని శిక్షించి, మల్లికాపురమున దగ్ధమొనరింప వలసిన దనియు, తనకు దృఢమగు శివభక్తినొసగి సర్వజన భజనీయుడగు, అంబారూపంబు నొసగి మల్లికార్జునాఖ్యచే పరమేశ్వరుడు సుప్రసిద్ధిడు కావలెనని వరములు కోరినది.అది మొదలు మల్లికార్జునడు అను పేరుకలుగుట, చంద్రమతి భ్రమరకీటక న్యాయమున అంబా స్వరూపముగా భ్రమరాంబ నామమున సర్వలోక భజనీయుడగుట జరిగింది.పరమేశ్వర శాప దగ్ధమై మల్లికాపురము నిర్ములన అగుటయు, చంద్రగుప్తుడు పచ్చబండై పాతాళ గంగలో బడుటచే ఆజలము పచ్చగా మారుటయు జరిగింది.

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 54517